శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం రాబోతోంది

క్రోధి

• ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని మార్చిన కొత్త సంవత్సరంగా చరిత్రలో నిలవాలి
• తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాస గృహంలో ఘనంగా ఉగాది వేడుకలు
• పంచాంగ శ్రవణం విని ఉగాది పచ్చడి స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్

“శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం రైతుకు క్షేమం కలిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు చూపాలి. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూడాలి. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాలి. వ్యాపారులకు మంచి లాభాలు అందించాలి. కూలీలకు తగిన ఉపాధి అవకాశాలు లభించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది కొత్త బాటలో పయనించి వెలిగిపోవాలి. కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ఏర్పడాలి” అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. పిఠాపురం నియోజక వర్గం చేబ్రోలులోని నివాస గృహంలోకి ప్రవేశించి పూజలు చేశారు. అక్కడే ఉగాది వేడుకలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారు, బీజేపీ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు గారు, కాకినాడ పార్లమెంటు అభ్యర్ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గార్లతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాగ శ్రవణం చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. టీడీపీ ఇంఛార్జ్ శ్రీ వర్మ స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉగాది పచ్చడిని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. శ్రీ క్రోధి నామ సంవత్సర గంటల పంచాంగ పుస్తకాలను బహూకరించారు.
• పిఠాపురం నుంచే మార్పు మొదలు
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వ మతాల్లోని వారు, సర్వ ప్రాంతాల్లో ఉండే వారు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించబోతోంది. పిఠాపురం నుంచే ఈ మార్పు మొదలు కాబోతోంది. శ్రీ పురూహుతికా అమ్మవారి ఆశీస్సులు, శ్రీ పాద శ్రీ వల్లభుడి దీవెనలు, బంగారు పాపమ్మ అండదండలతో కచ్చితంగా పిఠాపురం నుంచి విజయ ప్రస్థానం ప్రారంభించబోతున్నాను. పిఠాపురం రావాలని మొదటి నుంచి కోరుకున్న శ్రీ ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దశ దిశ చూపాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఉగాది వేడుకల నిమిత్తం పిఠాపురం విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆడపడుచులు గుమ్మడికాయలతో దిష్టి తీసి నూతన గృహంలోకి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు, ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, పార్టీ నేతలు శ్రీ వేములపాటి అజయ్ కుమార్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ ఎన్.శంకర్ గౌడ్, శ్రీ యాతం నగేష్, శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ బన్నీ వాసు, పిఠాపురం నియోజక వర్గం నాయకులు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్