ముఖ్యమంత్రి కావడానికి నేను సంసిద్ధం

ముఖ్యమంత్రి

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

* పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ది చేస్తాం

* ఆలయాలపై దాడుల కుట్ర చిచ్చు ముఖ్యమంత్రి ఆలోచనే

* 219 ఘటనలు జరిగితే ఒక్క నిందితుడినీ పట్టుకోలేకపోయారు

 * సమాజంలో గొడవలు జరిగితే వైసీపీకి లాభం అన్నదే వారి ప్రణాళిక

* రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం గంజాయికి రాష్ట్రమే కేరాఫ్ అడ్రస్ చేశారు

* పిఠాపురంలో వారాహి విజయ యాత్రలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ 

            ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  అన్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురం నుంచి అర్ధిస్తున్నాను అన్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వారాహి విజయ యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పిఠాపురంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్  మట్లాడుతూ “ఈ రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్. పిఠాపురం రాగానే నాకు రాష్ట్రంలో జరిగిన హిందూ ఆలయాల మీద దాడులు గుర్తుకొచ్చాయి. ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన దాగుంది. వైసీపీ నాయకుల కుట్ర దాగుంది. వరుసగా హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే సనాతన ధర్మం నమ్మే హిందువులంతా వేరే మతస్థులను అనుమానించాలి. దాని ద్వారా వారితో గొడవ పడాలి. సమాజంలో ఘర్షణలు చెలరేగితే వైసీపీ దాని నుంచి బోలెడు లాభం పొందాలనే చచ్చు ప్రభుత్వం ఆలోచనలతోనే వరుసగా ఆలయాల మీద దాడులు జరిగాయి. సమాజంలో ఎన్ని గొడవలు జరిగితే వైసీపీ నాయకులకు అంత ఇష్టం. యువకులు తమ భవిష్యత్తును వదిలేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఈ నాయకులు అంత ఆనందపడతారు. పిఠాపురంలో మొదట హిందూ దేవతల విగ్రహం ధ్వంసం చేస్తే నిందితుడిని పిచ్చివాడు అని చెప్పారు. మరి 219 దాడులు, విగ్రహాల ధ్వంసం కూడా పిచ్చివాళ్ల పనేనా..? శ్రీరాముడి విగ్రహం తల నరికింది కూడా పిచ్చివాడేనా..? ఎందుకు విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయలేదు అంటే వైసీపీ దగ్గర సమాధానం ఉండదు. వైసీపీ అనే దుష్ట ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తె ఎవరినీ బతకనివ్వరు. ప్రతి ఇంట్లోకి వైసీపీ గుండాలు వచ్చి దోచుకుంటారు. హంతకులు.. గుండాలు.. రౌడీలు.. అవినీతి పరులతో వైసీపీ ప్రభుత్వం నిండిపోయింది. వైసీపీ పార్టీ గుండాలకు నిలయం. నేర పూరిత రాజకీయాలంటే నాకు చాలా చిరాకు. జనసేన ప్రభుత్వంలో నేర చరితులకు స్థానం ఉండదు. ప్రతి వైసీపీ గూండాగాళ్లను బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై ప్రజలతో కొట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. క్రిమినల్ మైండ్ ఉన్న వారు పాలిస్తే క్రిమినల్స్ కు వత్తాసు పలకకుండా ఏం చేస్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డ బయటకు వెళ్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి వస్తుందా లేదా అనే భయం అందరిలోనూ ఉంది.

* సురక్ష ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తాం

          సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయిదంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తుని దగ్గర వైసీపీ నాయకుడి అనుచరుడు భూమి కబ్జా చేశాడని ఓ ఆడబిడ్డ ఫిర్యాదు చేస్తే, ఆమెకు మానసికంగా బాగాలేదని కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా సమయంలో మాస్కులు లేవు అని చెప్పిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడు అని ముద్ర వేసి, చనిపోయేలా చేశారు. ఓ నాయకుడు గూండాలతో బెదిరిస్తే, మరో వైసీపీ నాయకుడు బహిరంగంగా గన్ తో తిరుగుతాడు. ఇదీ వైసీపీ ప్రభుత్వంలోనే జరుగుతున్న తంతు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నేరాలకు అడ్డా అయిపోయింది. జనసేన ప్రభుత్వంలో ‘‘సురక్ష ఆంధ్రప్రదేశ్’’ ను సాధించి తీరుతాం. అన్నీ వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా జనసేన బాధ్యత తీసుకుంటుంది. శాంతి భద్రతల పరిరక్షణను జనసేన ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్య అంశంగా చేస్తాం. పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించేలా చూస్తాం గత నాలుగేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేశారు. పోలీసుశాఖను నిర్వీర్యం చేశారు. వైసీపీ నాయకులు చెప్పిందే చట్టం… వేసిందే శిక్ష అన్నట్లు పరిస్థితి తయారైంది. పోలీసులపై పూర్తిస్థాయిలో వైసీపీ ఒత్తిళ్లు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. సున్నితమైన అంశాల్లో సైతం పోలీసులు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు.

* గంజాయిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం రావాలి

             రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ను గంజాయికి దేశ రాజధానిగా వైసీపీ మార్చింది. రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న గంజాయి దేశంలోనే అధికం. ఆంధ్రప్రదేశ్ గంజాయి మత్తులో తూగేలా తయారు చేశారు. మన్యంలో విపరీతంగా గంజాయి పడుతుంటే, దాన్ని రవాణా చేసి లాభపడుతోంది వైసీపీ నాయకులు. ప్రతి గ్రామానికీ, వీధిలో బహిరంగంగా గంజాయి దొరికే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో గంజాయిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం రావాలి. జనసేన ప్రభుత్వంలో నిజాయతీ గల పోలీసు అధికారులకు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించేలా అధికారం కట్టబెడతాం. పోలీసులు వారి విధులను ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి కాకుండా చేస్తే సమాజం అద్భుతంగా తయారవుతుంది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నేను ఉన్నపుడు ఓ ఆడబిడ్డ తన సమస్యను చెప్పుకోవాడానికి వచ్చింది. తాడేపల్లిలో నివసించే ఆ బిడ్డ ఇంటికి సీఎం ఇంటి రోడ్డు వెడల్పు కోసం కొట్టేశారు. పరిహారం ఇవ్వలేదు. దీని గురించి నేను మాట్లాడతానని హామి ఇచ్చిన తర్వాత మళ్లీ అదే ఆడబిడ్డ 10 రోజులకు మళ్లీ పార్టీ కార్యాలయం వద్ద కనిపించారు. అన్నయ్య మీతో మాట్లాడాలని జనంలో నించుంటే నేను దగ్గరికి పిలిచాను.. ఏమైందని అడిగితే ఆ తల్లి చెప్పే విషయాలు నాకే కన్నీళ్లు తెప్పించాయి. నన్ను కలిసి, వినతిపత్రం ఇచ్చిన తర్వాత నుంచి వైసీపీ నాయకులు వేధించడం మొదలుపెట్టారు. ఇంట్లోకి కూరగాయాలు తీసుకొస్తానని చెప్పిన అన్నను మూడు రోజుల తర్వాత ఆటోలో శవంగా తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు. నన్ను కలిశారు అన్న ఒకే కారణంతో ఆ కుటుంబాన్ని వైసీపీ నాయకులు సర్వనాశనం చేశారు. ఆ ఆడబిడ్డ వేదన, కన్నీటి తడి నుంచే జనవాణి కార్యక్రమం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. రాష్ట్రంలోని అందరి కన్నీటి బాధలను స్వయంగా వినాలని నిర్ణయించుకున్నాను.

* ఏడుకొండల స్వామితో ఆటలాడుతున్నారు జాగ్రత్త

             వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో దోపిడీ ఇష్టారాజ్యం అయిపోయింది. శ్రీవాణి ట్రస్టు అని దర్శనం కోసం పెట్టారు. రూ.10 వేలు కడితే దర్శనం ఉంటుంది. అయితే కట్టిన డబ్బుకు బిల్లు ఉండదు. కేవలం రూ.వేయికి మాత్రమే టిక్కెట్ కేటాయించినట్లు లెక్కలుంటాయి. మిగిలిని రూ.9 వేలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలీదు. ఏడుకొండల స్వామితో ఆటలాడుతున్నారు. నామరూపాలు లేకుండా పోతారు జాగ్రత్త. హిందూ ఆలయాలు, వాటి ఆస్తుల మీద వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. దేవాదాయశాఖను నిర్వీర్యం చేసి, కేవలం ఆలయాల వద్ద ఉన్న ఆస్తులను కాజేయడానికి ఈ ప్రభుత్వం చూస్తోంది. పిఠాపురం ఆధ్యాత్మిక శోభ ప్రాంతం. దీన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతాం.

* అన్నవరంలో నా రెండు చెప్పులు కొట్టేశారు..!

            మొన్న అన్నవరం శ్రీ సత్యదేవుడి దర్శనానికి వెళ్లినపుడు నాకు ఎంతో ఇష్టమైన రెండు చెప్పులను ఎవరో కొట్టేశారు. ఆ తర్వాత నాకు ఎవరో చెప్పారు. మీ చెప్పులు టీవీలో ఓ వ్యక్తి చేతిలో కనిపించాయి అని… ఆ చెప్పులంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆయన దగ్గర తీసుకొని, నా చెప్పులు నాకు ఇప్పించండి. ఇలా వైసీపీ నాయకులు చెప్పులను కూడా కాజేస్తే ఎలా..? దయచేసి ఆ చెప్పులు మాత్రం మర్చిపోకుండా ఇప్పించండి. గుళ్లలో చెప్పులు కూడా పట్టుకుపోయేలా ఈ నాయకులు తయారయ్యారు.

* రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకం

           సాగునీటి రంగానికి బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించారు. పిఠాపురం ప్రాంతానికి సాగునీరు అందించే ఏలేరు రిజర్వాయర్ నిధులేవీ కేటాయించలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు నిలిపేశారు. మళ్లీ ఏ మాత్రం నిధుల కేటాయింపు జరగలేదు. గొల్లప్రోలు ప్రాంతం దీనివల్ల మురుగుతో నిండిపోతోంది. కాలువల పూడికతత లేదు. పనులు చేయమంటే రివర్స్ టెండరింగ్ అంటూ నాటకాలు ఆడటం తప్ప, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. పిఠాపురం చుట్టపక్కల నుంచి అక్రమంగా మట్టిని రోజూ తవ్వుతున్నారు. రోజుకు 300 లారీల మట్టిని అమ్ముకుంటున్నారు. అంటే రోజుకు రూ.2 కోట్లను దోచేస్తున్నారు. ఈ సొమ్ము వైసీపీ నాయకుల జేబుల్లోకే వెళ్తోంది. కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు అందినకాడికి మట్టి బొక్కేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి మాత్రం చేయడం లేదు.

* యువతకు మొండి చేయి

             అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జనవరిలో యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేకపోయారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో ఏటా 500 మంది యువతను ఎంపిక చేసి, వారు వ్యాపారం పెట్టుకునేలా రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం చేస్తాం. వారు పదిమందికి ఉపాధి కల్పించేలా వాళ్లను తీర్చిదిద్దుతాం. అంతే తప్ప రూ. 5 వేలు, రూ.3 వేలు జీతాలకు చాకిరి చేసేలా చేయం. దీనికి ఏటా రూ.10 వేల కోట్లు అవుతుందని అంచనా. వైసీపీ పాలనలో కేవలం ఇసుక దోపిడీపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటా రూ.10 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ సీఎం ఎన్నికల ముందు అన్నట్లు నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. అది చేసేస్తా.. అన్నీ ఇచ్చేస్తా… అని చెప్పను. నేను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తాను. మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటాను. సినిమాలు వేరు.. రాజకీయం వేరు. నాకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు ఇష్టమే. అందరి అభిమానులు ఆలోచించి ఓట్లు వేయండి. నేను ఒక్క సినిమా చేస్తే దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుంది. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలు చేయబట్టే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోగలిగాను. సంపద సృష్టించాను కాబట్టే పంచగలిగాను.

* బాబాయిని చంపేసి…

           పాపం పసివాడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. బాబాయిని చంపేసి ఆ రక్తం తుడుచుకొని వచ్చి మళ్లీ నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాడు. సీబీఐ అధికారులు వీళ్లు మీద ఆధారాలతో నిందారోపణలు చేస్తుంటే … వీళ్లు మాత్రం సొంత చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత గారి మీద నిందారోపణలు చేస్తున్నారు. సొంత తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? మనం క్రిమినల్స్ ను ఎన్నుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. నేను బతికున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద క్రిమినల్స్ కూర్చొవడానికి ఇష్టపడను. అలా జరగకుండా నా వంతు పోరాటం నేను చేస్తాను. వైసీపీ నాయకులు అప్పులు తెచ్చి, ట్యాక్సులు పెంచి అభివృద్ధి అంటున్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, లారీలపై హరిత పన్ను, భవనాల నిర్మాణాలపై పన్ను ఇలా పెంచుకుంటూ పోతూ మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రజాధనం నుంచి ప్రకృతి వనరుల వరకు దోచుకుంటూ వైసీపీ నాయకులు కోట్లు దోచుకుంటున్నారు. జనసేన మాట్లాడితే గానీ వైసీపీ ప్రభుత్వాన్ని ఎదురించడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి దోచుకుంటున్నారు.

* కులం చూడొద్దు… గుణం చూడండి

         ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడా? కాదా అని చూడకుండా… సమర్ధుడా కాదా అని ఆలోచించి ఓటు వేయండి. సముద్ర కోతతో ఉప్పాడ గ్రామం మూడొంతులు మునిగిపోయింది. దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ల పంటలకు గిట్టుబాటు ధరతో పాటు విత్తనాలు సకాలంలో అందేలా చూస్తాం. రాష్ట్రానికి అన్నపూర్ణవంటి గోదావరి జిల్లాల్లో నీళ్లు కలుషితమైపోయాయి. గోదావరి జిల్లాలను కాపాడుకోగలిగితే రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. జనసేన ప్రభుత్వం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దశ, దిశా మార్చేలా ఉంటుంది. ఒక్కసారి నిజాయతీనే నమ్ముకున్న జనసేనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించండి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్